నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురబల కోట - జనవరి 30 : విశ్వం ఇంజినీరింగ్ కళాశాల, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ECE) విభాగానికి చెందిన విద్యార్థులు తమ పాఠ్యాంశాలలో భాగంగా ఇటీవల కేరళ రాష్ట్రం త్రివేండ్రంలో ఉన్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) కి చెందిన సారాభాయి విక్రమ్ స్పేస్ సెంటర్ను విద్యా పర్యటనగా సందర్శించారు. ఈ పర్యటనలో విద్యార్థులకు ప్రయోగ వాహనాల రూపకల్పన, ఉపగ్రహ సాంకేతికత, రాకెట్ ఇంజిన్ల అభివృద్ధి, కమ్యూనికేషన్ వ్యవస్థలు, నియంత్రణ వ్యవస్థలు వంటి అనేక ఆధునిక సాంకేతిక అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. అక్కడి శాస్త్రవేత్తలు మరియు ఇంజినీర్లు విద్యార్థులతో నేరుగా మమేకమై, భారత అంతరిక్ష కార్యక్రమాల ప్రగతి, భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాల లక్ష్యాలు, పరిశోధనలో అవకాశాల గురించి వివరించారు. విద్యార్థులు ప్రయోగశాలలు, పరిశోధన విభాగాలు, నమూనా కేంద్రాలను సందర్శించి, పాఠ్యపుస్తకాలలో నేర్చుకున్న సిద్దాంతాలను ప్రత్యక్ష అనుభవంతో అనుసంధానించుకునే అవకాశం పొందారు. ఈ సందర్శన విద్యార్థుల్లో పరిశోధనాత్మక దృక్పథాన్ని పెంపొందించడంతో పాటు, అంతరిక్ష రంగంలో వృత్తి అవకాశాలపై స్పష్టతనిచ్చింది. ఈ విద్యా పర్యటన విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాలు, విజ్ఞాన దృష్టి మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించిందని కళాశాల యాజమాన్యం, ECE విభాగాధిపతి డాక్టర్ బి సురేష్ బాబు మరియు అధ్యాపక బృందం అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి విద్యా పర్యటనలను నిర్వహించి, విద్యార్థులకు పరిశ్రమలతో అనుసంధానమైన ప్రాయోగిక జ్ఞానం అందించనున్నట్లు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ టీఎస్ గౌస్ బాషా తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు అన్ని ఇంజనీరింగ్ విభాగాల నందు జరుగుచున్నవని, ఇండస్ట్రియల్ పర్యటనల ద్వారా విద్యార్థులు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకొనుటకు ఉపయోగించుకుంటున్నారని తెలియజేశారు
Admin
Namitha News