నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఫిబ్రవరి 21 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ విభాగం వారు బెంగళూరుకు చెందిన రూమాన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రూమాన్ టెక్నాలజీస్ డైరెక్టర్ రక్షిత్ శెట్టి మరియు సీనియర్ టెక్నికల్ మేనేజర్ వెంకట్ బి. రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో రక్షిత్ శెట్టి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో పుస్తక జ్ఞానం మాత్రమే సరిపోదని, పరిశ్రమలకు అనుగుణమైన నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవడం అత్యవసరమని తెలిపారు. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా విద్యార్థులు తమ కెరీర్ అవకాశాలను విస్తరించుకోవచ్చని అన్నారు. తమ సంస్థ కేంద్ర ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి పథకాల ద్వారా పలు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులను అమలు చేస్తోందని, ఆ ప్రాజెక్టుల అనుగుణంగా విద్యార్థులకు ఉచితంగా శిక్షణ అందించి ఆధునిక సాంకేతిక రంగాల్లో వారి నైపుణ్యాలను పెంపొందిస్తామని తెలిపారు. కోర్సు పూర్తి చేసిన అర్హులైన విద్యార్థులకు ఉపాధి హామీ కల్పించే విధంగా ప్లేస్మెంట్ సహాయాన్ని అందిస్తామని, విద్య పూర్తయ్యే సమయానికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో ఇండస్ట్రీ–అకాడమియా అనుసంధానాన్ని బలోపేతం చేయడం, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, ఇంటర్న్షిప్లు, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్లు మరియు ప్లేస్మెంట్ సహాయాన్ని అందించడం లక్ష్యంగా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కార్యక్త్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, డీన్ -స్కూల్ అఫ్ కంప్యూటింగ్ డాక్టర్ చంద్ర ప్రకాష్ గుప్తా, విభాగాధిపతి డాక్టర్ ఎమ్.శ్రీదేవి, అసిస్టెంట్ డైరెక్టర్-ఇండస్ట్రీ రిలేషన్స్ డాక్టర్ పి.ఎమ్ బాలాజీ, కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్.నిత్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు
Admin
Namitha News