నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 24 : మదనపల్లె పట్టణం సమీపంలోని అంగళ్ళు లో ఉన్న మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఆధ్వర్యంలో “అనంతపురము నిమ్మకాయ”కు భౌగోళిక సూచిక (GI) ట్యాగ్ కోసం అధికారికంగా దరఖాస్తు సమర్పించబడినట్లు వైస్-ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. యూనివర్సిటీకి చెందిన మిట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ (MITS-IPFC) సాంకేతిక మరియు విధానపరమైన మద్దతుతో ఈ దరఖాస్తు సమర్పించబడిందని ఆయన పేర్కొన్నారు. అనంతపురము నిమ్మకాయ తన ప్రత్యేకమైన నాణ్యతా లక్షణాలతో విశేష గుర్తింపు పొందిందని, పండ్ల సమాన పరిమాణం, ఆకర్షణీయమైన రంగు, అధిక రసపుష్టి, సమతుల్య సిట్రిక్ ఆమ్లత్వం, ప్రత్యేక సువాసన మరియు ఎక్కువకాలం నిల్వ ఉండే లక్షణాలు ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన వ్యవసాయ-వాతావరణ పరిస్థితుల వల్ల ఏర్పడుతున్నాయని తెలిపారు. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, తాడిపత్రి, యాడికి మండలాలలో పండే ఈ నిమ్మకాయకు ప్రత్యేకమైన నాణ్యతా ప్రమాణాలు ఉన్నాయని తెలిపారు. ఈ దరఖాస్తు ద్వారా “అనంతపురము నిమ్మకాయ”ను అనంతపురం ప్రాంతానికి ప్రత్యేకంగా చెందిన విలక్షణ వ్యవసాయ ఉత్పత్తిగా అధికారిక గుర్తింపు పొందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జి.ఐ రక్షణ లభించడం ద్వారా ఉత్పత్తి పేరును దుర్వినియోగం కాకుండా రక్షించడంతో పాటు, నిజమైన సాగుదారులకు మెరుగైన ధరలు లభించడం, దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో అనంతపురము నిమ్మకాయకు మరింత విలువ పెరగడం సాధ్యమవుతుందని తెలిపారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు దోహదపడిన అవని ఫారం ల్యాబ్ టెక్నాలజీస్ (AFLABT) ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్, అనంతపూర్, మిట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ (MITS-IPFC) మరియు మిట్స్ ఆర్ & డి సెల్ వారి కృషిని మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సలర్ డాక్టర్ ఎన్. విజయ భాస్కర్ చౌదరి అభినందించారు. రైతు కేంద్రిత ఆవిష్కరణలు, సంప్రదాయ వ్యవసాయ జ్ఞాన పరిరక్షణ మరియు ప్రాంతీయ ఉద్యాన ఉత్పత్తులకు మేధో సంపత్తి హక్కుల ద్వారా గుర్తింపు తీసుకురావడంలో మిట్స్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్-ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ మరియు అడ్వైజర్ (ఆర్ & డి) డాక్టర్ తులసీరామ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News