నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 14 : భారత రాజ్యాంగ నిర్మాత, నవభారత నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశించిన కుల నిర్మూలన జరిగినప్పుడే దేశంలో నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతం మారినంత మాత్రాన దళితులపై సామాజిక వివక్ష తొలగిపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత క్రైస్తవులను దళితేతర క్రైస్తవులు వివాహం చేసుకోకపోవడమే దీనికి నిదర్శనమని, క్రైస్తవంలోనూ కుల వ్యవస్థ వేళ్లూనుకొని ఉందని విమర్శించారు. సిక్కు, బౌద్ధ మతాల్లోకి మారిన దళితులకు ఎస్సీ హోదా కల్పిస్తున్నట్లే, దళిత క్రైస్తవులను కూడా ఎస్సీలుగా పరిగణించాలని ఆయన డిమాండ్ చేశారు. సామాజికంగా వారు ఎదుర్కొంటున్న దాడులు, వివక్ష కులం ఆధారంగానే జరుగుతున్నాయని గుర్తు చేశారు. సచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిషన్లు దళిత క్రైస్తవుల స్థితిగతులను అధ్యయనం చేసి వారిని ఎస్సీ జాబితాలో చేర్చాలని సిఫార్సు చేసినా, పాలకులు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. జస్టిస్ కె.జి. బాలకృష్ణన్ కమిషన్ నివేదిక వచ్చే వరకు వేచి చూడకుండా అత్యున్నత న్యాయస్థానాలు నిర్ణయాలు తీసుకోవడం తొందరపాటు చర్యే అవుతుందని అభిప్రాయపడ్డారు. అణగారిన వర్గాల విముక్తి కోసం వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమాలు బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. కుల వివక్షకు వ్యతిరేకంగా చేసే పోరాటాన్ని వర్గ పోరాటంలో' అంతర్భాగం చేయడం ద్వారానే అసమానతలు లేని సమాజాన్ని నిర్మించగలమని ఆయన స్పష్టం చేశారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం, కుల దురహంకార దాడులకు వ్యతిరేకంగా సిపిఎం నిరంతరం పోరాడుతుందని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగరాజు, రామకృష్ణ, గోపాల్, రాజు, శంకరమ్మ, జయమ్మ, రెడ్డెమ్మ, శ్రీరాములు, రామచంద్ర, కృష్ణప్ప, రమణమ్మ, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News