నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలి -- నిబంధనలు అతిక్రమిస్తే షాపులు సీజ్ -- ఉపాధి కూలీలకు బిల్లులు అందేలా చర్యలు తీసుకోవాలి -- గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకూడదు -- అధికారులు, సచివాలయ ఉద్యోగులు బాధ్యతగా పనిచేయాలి -- మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే షాజహాన్ బాష రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలని, ఎవరైనా నాసిరకం విత్తనాలు సరఫరా చేసినా, ఎమ్మార్పీ ధరల కంటే అధిక ధరలకు ఎరువులు, విత్తనాలు విక్రయించినా ఆ షాప్ లను సీజ్ చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే హెచ్చరించారు. గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ రెడ్డెమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే షాజహాన్ బాష ముఖ్య అతిథిగా పాల్గొనగా ఎంపీడీవో తాజ్ మస్రూర్, వైస్ ఎంపీపీ నందిని తాజ్, అన్ని శాఖల మండల స్థాయి అధికారులు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఉపాధిహామి విశ్లేషణలో ఆరు నెలలుగా కూలీలకు ఉపాధి బిల్లులు పడలేదని చర్చకు రావడంతో ఎమ్మెల్యే ఆగ్రహించారు. కూలిపనులు లేకపోవడంతో నే కదా కూలీలు ఉపాధి పనులకు వెళ్లారు, 15 రోజులకొకసారి ఇవ్వాల్సిన బిల్లులు ఆరునెలలుగా ఇవ్వకపోతే కూలీలు ఏమి తిని బతకాలని ఏపిఓ చెన్నకేశవులను ఎమ్మెల్యే ప్రశ్నించారు. వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి కూలీలకు వెంటనే బిల్లులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఖాళీగా ఉన్న 16 ఫీల్ట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రఞాళిక సిద్దం చేయాలన్నారు. పెంచుపాడు, దొనబైలు, కోళ్లబైలు, మేకలవారిపల్లి తదితర రూరల్ గ్రామాలలో పశువైద్య సేవలు కుంటుపడ్డాయని, తమకు ఫిర్యాదులు అందుతున్నాయని, ఇకనుంచి ప్రతిరోజు పశువైద్య సిబ్బంది లేదా అధికారి ఆయా గ్రామాల్లో పర్యటించి తప్పనిసరిగా పశు వైద్య చికిత్సలు అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యే సూచించారు. మరోసారి ఫిర్యాదులు వస్తే సహించేది లేదన్నారు. ప్రభుత్వం పశువులకు ఫిమేల్ గర్భ ధారణ జరిగేందుకు ఇంజక్షన్లను ప్రభుత్వం అందుబాటులో తేవడంతో ఈ విషయాన్ని గ్రామాల్లోని పాడి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య, విద్యుత్ సమస్యలు నెలకొన్నాయని ముఖ్యంగా కోళ్లబైలు పంచాయతీలో విద్యుత్ తీగలు కింద వేలాడుతుండడంతో ఇటీవల బాలిక విద్యుత్ ఘాతానికి గురై గాయపడిందని వైస్ ఎంపీపి నందినీతాజ్ సభ దృష్టికి తెచ్చారు. వెంటనే ఆ సమస్య ను పరిష్కరించాలని, ఎక్కడైనా సరే విద్యుత్ ప్రమాదాలు సంభవిస్తే దానికి పూర్తి బాధ్యులు విద్యుత్ అధికారులేనని, వారిపై చర్యలకు సిఫారసు చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, వీఆర్వోలు కార్యాలయాలకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులు ప్రజలకు బాధ్యతాయుతంగా మెరుగైన సేవలు అందిస్తూ సకాలంలో వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించాలని, సచివాలయంలో అందుబాటులో ఉంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరి సమస్యను త్వరితగతిన పరిష్కారం చూపాలని తెలిపారు. కార్యాలయాల్లో లేకుండా ఇష్టానురీతిగా విధులకు హాజరైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో చర్చించిన సమస్యలను పరిష్కరించాలని, రాబోయే సమావేశంలో తిరిగి అవి రిపీట్ కాకుండా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఎంపిపి భర్త వెలుగు చంద్ర, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. ఫోటో రైటప్ మండల సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే షాజహాన్ బాష
Reporter
Namitha News