నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 14 : రాష్ట్ర ప్రభుత్వం తరఫున అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పద్దుల బడ్జెట్ కాదని సంక్షేమాన్ని అభివృద్ధిని జోడెద్దుల్లాగా నడిపే బడ్జెట్ అని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఈ బడ్జెట్ లో ఏమీ లేదని, అన్నమయ్య జిల్లాకు తీరని ద్రోహం చేసిందని సిపిఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు ఆరోపించారు. 3,32,205 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ సగం ద్రవ్య లోటుతో ఉందని ఇందులో అప్పులు, ప్రజల పైన భారాలు, అంబానీ ఆదానీలకు వడ్డించడం తప్ప ఇంకేమీ లేదని అన్నారు. రైతాంగానికి, వ్యవసాయ కూలీలకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చే విధంగా లేదని అన్నారు. ఈ నెల 12న దేశవ్యాప్తంగా కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కూలీలు లేబర్ కోడ్ లు రద్దు చేయాలని, పంటలకు గిట్టుబాటు ఇవ్వాలని ఉపాధి హామీని పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సమ్మెను రాష్ట్ర ప్రభుత్వం కనీసం పరిగణలోకి కూడా తీసుకున్నట్లు అనిపించలేదని, అంగన్వాడి, ఆశ, మధ్యాహ్నం భోజన కార్మికులు, వివోఏలు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్మికులు వేతనాలు కోసం డిమాండ్ చేస్తా ఉంటే దాన్ని పెడచెవిని పెట్టడం దుర్మార్గం అన్నారు. అన్నమయ్య జిల్లాకు రాష్ట్ర బడ్జెట్ చేసింది శూన్యం అని అన్నారు. ఉక్కు పరిశ్రమ, కడప బెంగళూరు రైల్వే లైను ఊసే లేదన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు, గాలేరు నగరి కేటాయింపులు అంతంత మాత్రమేనని అవి మెయింటెనెన్స్, ఉద్యోగుల జీతభత్యాలకే సరిపోతాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హంద్రీనీవా పూర్తి ఎప్పుడు అవుతుందో సమాధానం చెప్పాలని అన్నారు. మదనపల్లి మెడికల్ కాలేజీ, మదనపల్లి ట్రాఫిక్ సమస్య పరిస్కారం, జిల్లాలో రైతాంగానికి అనుకూలంగా టమోటా హబ్బు ఏర్పాటు వంటి వాటికీ ఎలాంటి హామీ ఇవ్వలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దుర్మార్గ బడ్జెట్ ని వ్యతిరేకించాలని ప్రజలకు పిలుపునిచ్చారు
Admin
Namitha News