నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 08 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాయితీతో భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల కూలీలు, రైతులకు ఉపాధి హామీ ఓ జాతరలా నిలవడం ఖాయమని అన్నమయ్య జిల్లా డ్వామా పీడీ వెంకటరత్నం ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో గ్రామీణ ప్రాంత కూలీలకు వంద రోజుల పని దినాలను 125 రోజులకు పెంపు, పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి, వారానికి ఉపాధి భృతి చెల్లింపు ఈ మూడు అంశాలే కీలక చట్టంగా నిలిచినట్లు చెప్పారు. ఉపాధి హామీలో కూలీలు పనుల కోసం వలసలు వెళ్లే సమస్య లేదని అదేవిధంగా రైతులు పొలం పనులు సమయంలో కూలీలకు విశ్రాంతి ఉంటుందని పనులు చేసుకునే వారికి పనులు కల్పిస్తామన్నారు. ఉపాధి హామీ పథకంలో నీటి నిల్వ పనులు, పండ్ల తోటల పెంపకం, మొక్కల పెంపకం చేపట్టి భూగర్భ జలాలు పెరిగి తద్వారా కూలీలకు ఉపాధితో పాటు రైతులు ప్రకృతి వ్యవసాయంతో అభివృద్ధి బాట పట్టడానికి ఉపాధి సిబ్బందిని సమాయత్తం చేస్తున్నట్లు చెప్పారు. జాబ్ కార్డ్ కలిగిన ప్రతి ఒక్కరికి ఉపాధి పనులతో పాటు గ్రామాల అభివృద్ధి పనులు, పశుగ్రా స పెంపకం పనులు కల్పించి గ్రామ సీమలు పర్యావరణంతో కళకళ లాడాలని ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలను నెరవేర్చడానికి సమిష్టి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
Reporter
Namitha News