నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి: జనసేన పార్టీకి కానీ, తనకు కానీ ఎటువంటి సంబంధం లేని ఒక చిన్న పార్కింగ్ గొడవను రాజకీయ కక్షతో వక్రీకరించి తనపై తప్పుడు ఆరోపణలు మోపడం తీవ్ర అన్యాయమని జనసేన పార్టీ నేత మైఫోర్స్ మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల 29న మదనపల్లిలో తన తమ్ముడు నిర్వహిస్తున్న ఎంజీ గ్రాండ్ రెస్టారెంట్ సమీపంలో జరిగిన ఘటనను ఆధారంగా చేసుకుని తన వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సీసీ కెమెరా ఫుటేజ్ను జిల్లా ప్రజల ముందుకు తీసుకొచ్చి నిజాలు వెల్లడిస్తున్నట్లు తెలిపారు. సీసీ ఫుటేజ్లో దాడి చేసింది తమవైపు నుంచి కాదని, ప్రత్యర్థులే దాడికి పాల్పడ్డారనేది స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఉమేష్ కత్తితో దాడి చేశాడన్న ఆరోపణ పూర్తిగా అబద్ధమని, ఫుటేజ్లో కత్తి మాట అటుంచితే కనీసం గడ్డిపరక కూడా ఎవరి చేతిలోనూ లేదని స్పష్టం చేశారు. అలాగే తాను పిడిగుద్దులతో దాడి చేశాడన్న ఆరోపణ కూడా పూర్తిగా అసత్యమని, తాను ఎవరినీ తాకనూ లేదని సీసీ కెమెరా దృశ్యాల్లో స్పష్టంగా ఉందన్నారు. గత 12 సంవత్సరాలుగా మదనపల్లి జిల్లాలో రాజకీయాల్లో ఉన్న తనపై ఇప్పటివరకు ఏ ఒక్క తప్పుడు పని ఆరోపణ కూడా లేదని మహేష్ పేర్కొన్నారు. తాను ల్యాండ్ గ్రాబింగ్, ఇసుక దోపిడీ, లిక్కర్ వ్యాపారాలు, సెటిల్మెంట్లు, పంచాయతీలు వంటి ఏ అక్రమ కార్యకలాపాల్లోనూ పాల్గొనలేదని స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా మద్యం, పొగతాగడం వంటి అలవాట్లు లేవని, నీతి–నిజాయితీ–నిబద్ధతతోనే రాజకీయాలు చేస్తున్నానన్నారు. వ్యాపార స్థలంలో జరిగిన వ్యక్తిగత ఘటనను జనసేన పార్టీకి ముడిపెట్టి పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీయాలని ప్రయత్నించడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి సీసీ కెమెరా ఫుటేజ్ ప్రజల ముందే ఉందని, నిజం తన వైపే ఉందని చెప్పారు. రాజకీయ దురుద్దేశంతో తనపై జరుగుతున్న ఈ కుట్రను జిల్లా ప్రజలు గమనించాలని, న్యాయం తనకే జరుగుతుందన్న నమ్మకంతో ప్రజల మద్దతు కోరుతున్నట్లు తెలిపారు.
Reporter
Namitha News