నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - జనవరి 27: తప్పుడు పత్రాలతో పాస్పోర్ట్ పొందేందుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కిన వ్యక్తికి రాయచోటి కోర్టు కఠిన శిక్ష విధించింది. ఫోర్జరీ పత్రాల కేసులో నిందితుడైన షేక్ వసీం అక్రమ్కు రెండేళ్ల సాధారణ జైలు శిక్షతో పాటు 5,000 రూపాయల జరిమానా విధిస్తూ గౌరవనీయ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీ టి. సుయోధన గారు మంగళవారం తీర్పు వెలువరించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రాయచోటి టౌన్ అలీమాబాద్ వీధికి చెందిన ఖాజా హుస్సేన్ కుమారుడు షేక్ వసీం అక్రమ్ 2023 నవంబర్ 5న ECNR పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ ప్రక్రియలో భాగంగా అతను తన పదవ తరగతి మార్కుల మెమోను ఫోర్జరీ చేసి, నకిలీ పత్రాలను అసలైనవిగా నమ్మించి అధికారులను మోసం చేసేందుకు ప్రయత్నించాడు.వసీమ్ అక్రమం పై అప్పటి ఎస్పీ ఆదేశాల మేరకు రాయచోటి అర్బన్ పోలీసులు రంగంలోకి దిగారు. అప్పటి సీఐ సుధాకర్ రెడ్డి సమగ్ర దర్యాప్తు జరిపి, నిందితుడి పై క్రైమ్ నంబర్ 168/2023 కింద సెక్షన్ 420, 464, 468 (IPC) ప్రకారం కేసు నమోదు చేశారు. పక్కా సాక్ష్యాధారాలతో కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. కేసు విచారణలో భాగంగా ప్రాసిక్యూషన్ తరఫున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీ సాయి రామకృష్ణ పటిష్టమైన వాదనలు వినిపించారు. నేరం నిరూపితం కావడంతో, న్యాయమూర్తి నిందితుడు వసీమ్ అక్రమ్ కి రెండేళ్ల సాధారణ జైలు శిక్ష, 5వేల రూ జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు
Admin
Namitha News