నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - జనవరి 20 : సమాజ శ్రేయస్సు కోసం, ధర్మ రక్షణ కోసం అహింసా మార్గంలో అగ్ని ప్రవేశం చేసిన త్యాగమూర్తి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని (మాఘ శుద్ధ విదియ) పురస్కరించుకుని, అన్నమయ్య జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం అమ్మవారికి ఘన నివాళులు అర్పించారు. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ యం. వెంకటాద్రి గారు అమ్మవారి చిత్రపటానికి పూలమాలలు వేసి భక్తిశ్రద్ధలతో అంజలి ఘటించారు
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ గారు మాట్లాడుతూ.. అమ్మవారి ఆత్మార్పణ వెనుక ఉన్న పురాణ విశిష్టతను మరియు ఆమె త్యాగాన్ని కొనియాడారు. పురాణాల ప్రకారం, పార్వతీ దేవి పరమశివుడిని వివాహం చేసుకోవడానికి కన్యగా ఉండి ఘోర తపస్సు చేశారు. అయితే లోక కంటకుడైన బాణాసురుడిని సంహరించడం కోసం తన తపస్సు పూర్తి కాకముందే, భక్తుల కోరిక మేరకు శివకళ్యాణం జరగకుండా ఆగిపోయి, అమ్మవారు కన్యా రూపంలోనే ఉండిపోయారు. వివాహం పూర్తి కాకపోయినా, తపస్సు అసంపూర్తిగా ఉన్నా, తన భక్తుల రక్షణ కోసం అక్కడే కొలువై ఉండాలని నిర్ణయించుకున్న ఆ మహా తల్లిని మనం పూజిస్తున్నాము. ఆమె ఆత్మార్పణకు గుర్తుగా కన్యకా పరమేశ్వరి రూపంలో వెలసి నేటికీ కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. "అహింసా పరమోధర్మః" అనే నినాదంతో సమాజ హితం కోసం ప్రాణత్యాగం చేసిన ఆమె మార్గం నేటి మహిళా సాధికారతకు, సామాజిక బాధ్యతకు దిక్సూచి అని అదనపు ఎస్పీ గారు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఉన్నతమైన విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని, జిల్లా ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ యం.పెద్దయ్య, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జి. శంకర మల్లయ్య, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ ఏ. ఆదినారాయణ రెడ్డి, పలువురు ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, డిపిఓ సిబ్బంది, పోలీసు సిబ్బంది, మహిళా పోలీసులు మరియు హోంగార్డులు పాల్గొని అమ్మవారికి నివాళులర్పించారు
Admin
Namitha News