నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 24 : మదనపల్లె సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు ది టైమ్స్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికతలను విద్యా, పరిశోధన మరియు పరిపాలనా రంగాలలో సమర్థవంతంగా వినియోగించేందుకు “ఏ ఐ ట్రైనింగ్ హబ్”ను వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్ ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ , కృత్రిమ మేధస్సు భవిష్యత్తును నిర్దేశించే కీలక సాంకేతికతగా మారిందని, ఆసక్తి కలిగిన అధ్యాపకులు ముందుకు వచ్చి శిక్షణ పొందాలని తెలిపారు. ఏ ఐ రంగంలో నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు మిట్స్ యూనివర్సిటీ పూర్తి మద్దతు అందిస్తుందని, ఇది కేవలం తొలి దశ మాత్రమేనని, తదుపరి దశల్లో పరిశ్రమలలో అనుభవజ్ఞులైన ప్రముఖ ఏ ఐ నిపుణులను ఆహ్వానించి ఉన్నత స్థాయి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డా. డి. ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ, ఏ ఐ ద్వారా రోజువారీ పనులను మరింత సులభతరం చేసుకునే అనేక అవకాశాలు ఉన్నప్పటికీ వాటి వినియోగంపై చాలామందికి పూర్తి అవగాహన లేదన్నారు. యూనివర్సిటీ లోని సుమారు 400 మంది అధ్యాపకులు, 300 మంది బోధనేతర సిబ్బందిని ఏ ఐ సామర్థ్యాలతో తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. మొదటి దశలో అందరికీ అవసరమైన ప్రాథమిక ఏ ఐ సాధనాలపై శిక్షణ అందించగా, రెండో దశలో బోధన, పరిశోధన, పరిపాలన తదితర రంగాలకు అనుగుణంగా ప్రత్యేక మాడ్యూళ్లలో శిక్షణ అందించనున్నట్లు వివరించారు. “(ఫ్యూచర్-రెడీ ఇన్నోవేషన్ @ మిట్స్)Future-Ready Innovation @ MITS” అనే లక్ష్యంతో ప్రారంభమైన ఏ ఐ ట్రైనింగ్ హబ్ ద్వారా జ్ఞానం, నైపుణ్యాలు మరియు సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించి భవిష్యత్కు సిద్ధమైన విద్యా వాతావరణాన్ని సృష్టించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. పి. రామనాథన్ మాట్లాడుతూ, నేటి విద్యార్థులు చాట్ జిపిటి, జెమినీ వంటి ఏ.ఐ సాధనాలను విస్తృతంగా వినియోగిస్తున్న నేపథ్యంలో అధ్యాపకులు కూడా AI సాంకేతికతలపై పూర్తి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. బోధన, అసైన్మెంట్ల రూపకల్పన, పరిశోధన, ప్రజెంటేషన్ల తయారీ, జాతీయ విద్యా విధానం (NEP) వంటి విస్తృత పత్రాల విశ్లేషణలో AI ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. అధ్యాపకులు నిరంతరం కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకుంటూ విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సనత్ హెగ్డే, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News