నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 01 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ విద్యార్థులు అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ శాసనసభను విద్యా పర్యటనలో భాగంగా సందర్శించి, రాష్ట్ర బడ్జెట్ సమీక్ష సమావేశాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అరుదైన అవకాశం పొందారని వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. ఈ సందర్శన విద్యార్థులకు శాసనసభలో జరిగే ప్రత్యక్ష చర్చలు, ప్రజా సమస్యలపై సభ్యులు వ్యక్తపరిచే అభిప్రాయాలు, ప్రభుత్వ ఆర్థిక విధానాలపై జరిగే విశ్లేషణలు మరియు ప్రజా సంక్షేమ పథకాల అమలుపై తీసుకునే నిర్ణయాల ప్రక్రియలను సమగ్రంగా అర్థం చేసుకునే అవకాశాన్ని కల్పించింది. బడ్జెట్ సమావేశంలో ఆదాయం-వ్యయం లెక్కలు, అభివృద్ధి కార్యక్రమాల కేటాయింపులు, వివిధ రంగాలకు సంబంధించిన ప్రణాళికలు వంటి అంశాలు ఎలా చర్చించబడతాయో విద్యార్థులు ఆసక్తిగా వీక్షించారని తెలిపారు. ఈ సందర్భంగా గౌరవనీయులైన స్పీకర్ సి. అయ్యన్న పాత్రుడు ను విద్యార్థులు మర్యాదపూర్వకంగా కలుసుకుని పరస్పర సంభాషణ జరిపే అవకాశం పొందారని అన్నారు. ఆయన శాసన వ్యవస్థ యొక్క ప్రాముఖ్యత, ప్రజాస్వామ్య విలువలు, ప్రజా ప్రతినిధుల బాధ్యతలు మరియు యువత సమాజ నిర్మాణంలో పోషించాల్సిన కీలక పాత్ర గురించి స్పష్టమైన మరియు ప్రేరణాత్మక సందేశాన్ని అందించి, మంచి నాయకత్వ లక్షణాలు, నైతిక విలువలు మరియు ప్రజాసేవ భావనతో ముందుకు సాగాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిట్స్ అధ్యాపకులు మరియు విద్యార్థులకు మిట్స్ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ యెన్.విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సల్లర్ యెన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళ, డీన్-స్కూల్ అఫ్ మేనేజ్మెంట్ డాక్టర్ భాను శ్రీ రెడ్డి మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు.
Reporter
Namitha News